Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 47

Story of Sapta maruths & the city of Visala !

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా |
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాs బ్రవీత్ ||

తా|| గర్భము ఏడు ముక్కలుగా చేయబడడముతో దితి అత్యంత దుఃఖితురాలయ్యెను. అప్పుడు ఆమె అనునయవాక్యములతో దుర్జయుడైన ఆ ఇంద్రునితో ఇట్లు పలికెను.

బాలకాండ
నలుబది ఏడవ సర్గము
( సప్తమరుతుల కథ - విశాల నగర కథ)

విశ్వామిత్రుడు దితి కథ చెప్పసాగెను.

'గర్భము ఏడు ముక్కలుగా చేయబడడముతో దితి అత్యంత దుఃఖితురాలయ్యెను. అప్పుడు ఆమె అనునయవాక్యములతో దుర్జయుడైన ఆ ఇంద్రునితో ఇట్లు పలికెను. "ఈ గర్భము నా అపరాధమువలన విఫలమాయెను. ఓ బలసూదనా ! దేవేశా ! దీనిలో నీ అపరాధమేమియునూ లేదు. నా గర్భము విపర్యమైననూ ప్రియము చేయుటకు కోరుచున్నాను.ఈ ఏడుగురు మరుత్తులు ఏడు స్థానముల అధిపతిలగుదురు. దివ్యస్వరూపులైన నా ఆత్మజులు సప్తవాయువుల అధిపతులై దివ్యలోకములో మరుత్తులు అను పేరుతో ఖ్యాతి పొందెదరు. ఓకడు బ్రహ్మలోకములో సంచరించును.ఇంకొకడు ఇంద్రలోకములో , మూడవవాడు మహాయశస్వియై వాయువు పేరుతో ఖ్యాతి పొందును. ఓ ఇంద్రా ! మిగిలిన నలుగురూ నీ శాసనములో నాలుగు దిశలలో చరింతురు. నీకు శుభమగుగాక. ఓ దేవభూతా నా అత్మజులు నీవు చేసిన కార్యము చే "మారుతా " అని పేరుతో వాసికెక్కుదురు".

'బలనిషూదుడు పురందరుడు అయిన ఇంద్రుడు ఆ మాటలను విని , ప్రాంజలి ఘటించి దితితో ఇట్లు పలికెను. " ఇదంతయూ నీవు చెప్పిన విధముగనే అగును.నీ పుత్రులు దివ్యస్వరూపులై సంచరించెదరు. నీకు శుభమగుగాక".

' ఓ రామా ! ఆ మాతాపుత్రులు ఇద్దరూ ఆ తపోవనములో ఈ విధముగా నిశ్చయముచేసి, కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరి అని వింటిమి. ఓ కకుత్ స్థ ! ఈ దేశములోనే పూర్వము తపసిద్ధురాలైన దితికి మహేంద్రుడు పరిచర్యలు సలిపెను. ఓ నరవ్యాఘ్ర ! ఇక్ష్వాకుడు అనబడు పరమ ధార్మికుడు ఉండెడివాడు. అతడు అలంబుస ద్వారా విశాల అని పుత్రునకు జన్మనిచ్చెనని వినికిడి. ఆయన పేరుతొనే విశాల అను నగరము ఇచట కట్టబడినది.

'ఓ రామా ! హేమచంద్రుడనువాడు విశాలుని పుత్రుడు. హేమచంద్రుని తరువాత సుచంద్రుడనువాడు పేరుపొందెను. ఓ రామా ! సుచంద్రుని తనయుడు ధూమ్రాశ్వుడు అని వినికిడి. ధూమ్రాశ్వుని పుత్రుడు సృంజయుడు. సృంజయుని పుత్రుడు సహదేవుడు శ్రీమంతుడు ప్రతాపము గలవాడు . సహదేవుని పుత్రుడు పరమధార్మికుడైన కుశాశ్వుడు. కుశాశ్వుని పుత్రుడు సోమదత్తుడు ప్రతాపముగలవాడు మహాతేజస్సు గలవాడు. సోమదత్తుని పుత్రుడు కాకుత్ స్థుడని వినికిడి. అతని పుత్రుడు మహాతేజోవంతుడు దుర్జయుడు సుమతి అను పేరు గలవాడు. అతడు ప్రస్తుతము ఈ నగరమును పరిపాలించుచున్నాడు. ఇక్ష్వాకుని అనుగ్రహముచే విశాల నగరమును పాలించిన రాజులందరూ దీర్ఘాయుస్సుకలవారు. ధార్మికులు మహావీరుల'.

'ఓ రామా ! ఇక్కడ ఈ రాత్రికి సుఖముగా విశ్రమింతము. ఓ నరశ్రేష్ఠా ! రేపు ఉదయము జనకుని దర్శనమునకు పోయెదమ".

మహాతేజోవంతుడైన సుమతి విశ్వామిత్రుని రాకగురించి తెలిసికొని మహాయశస్సుగల ఆ నరశ్రేష్ఠుడు ఎదురుగా వచ్చెను. పురోహితులతో బంధువులతో పూర్తిగా పూజించి , ప్రాంజలిఘటించి విశ్వామిత్రునితో ఈ విధముగా పలికెను. "ఓ మునీశ్వరా ! ధన్యుడను. మీ రాకతో అనుగ్రహించబడినవాడను. ! మీ దర్శనము కూడా ప్రాప్తమైనది.ఇంతకన్న ధన్యతమైనది ఇంకొకటిలేదు" అని.

|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలభైఏడవ సర్గ సమాప్తము.||

|| ఓమ్ తత్ సత్ ||

ధన్యోస్మి అనుగ్రహీతోస్మి యస్య మే విషయం మునిః |
సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మయా ||

తా|| ఓ మునీశ్వరా ! ధన్యుడను. మీ రాకతో అనుగ్రహించబడినవాడను. ! మీ దర్శనము కూడా ప్రాప్తమైనది.ఇంతకన్న ధన్యతమైనది ఇంకొకటిలేదు.

||ఓమ్ తత్ సత్ ||

|| Om tat sat ||